🔹ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ నుంచి ప్రయివేటు భీమా కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసిన సంగతి తెలిసిందే. వాటికి ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలి. దానికి కట్టాలా వద్దా అన్నది వారిష్టం. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఖజానాద్వారా జీతాలు పొందుతున్న వారందరికి ప్రభుత్వం కూడా బీమా సౌకర్యాన్ని కల్పించింది. అదే ఏపీజీఎల్ఐ (ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్సు). ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ బీమాను కట్టాల్సిందే.
బీమా తప్పనిసరి
🔹ఉద్యోగుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఉద్యోగి బీమా సభ్యత్వాన్ని తీసుకోవలసిందే. తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. ఎస్జీటీ నుంచి ప్రధానోపాధ్యాయుడి వరకు, నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి గ్రూప్-1 అధికారి వరకు పాలసీ తీసుకోవాలి. ఏ ప్రభుత్వ శాఖ అయినా వారివారి డ్రాయింగ్ అధికారి ద్వారా పాలసీ చేయాలి. నెలనెలా జీతం నుంచి ప్రీమియం చెల్లింపు జరుగుతుంది.
🍁ప్రీమియాలు ఇలా ఉంటాయి
♦ఉద్యోగుల జీతం ఆధారంగా ప్రీమియాలను ప్రభుత్వమే నిర్ధారించింది. జీవో నెం.36 ప్రకారం 2016 ఏప్రిల్ 1వ తేదీనుంచి స్లాబ్ రేట్లు పెరిగాయి. గతంలో రూ.150 ఉండే స్లాబ్ రేటును రూ.500కు పెంచారు. అందువల్ల ఉద్యోగులు వేతనం నుంచి రూ.500కు తక్కువ కాకుండా మినహాయించి ఏపీజీఏల్ఐకి జమచేస్తారు. గరిష్ఠంగా రూ.2 వేల వరకు ప్రీమియం నిర్ధారించారు. అయితే పేలో 20 శాతం వరకు ప్రీమియం ఉండేలా పాలసీ తీసుకునే వీలుంది.
🍁ప్రీమియం స్లాబ్ రేటు
రూ.13,000-రూ.16,400 మధ్య పే ఉంటే రూ.500
రూ.16,401-రూ.21,230 మధ్య పే ఉంటే రూ.650
రూ.21,231-రూ.28,940 మధ్య పే ఉంటే రూ.850
రూ.28941-రూ.35,120 మధ్య పే ఉంటే రూ.1,150.
రూ.35,121-రూ.49,870 మధ్య పే ఉంటే రూ.1,400
రూ.49,871 కంటే ఎక్కువ పే ఉంటే రూ.2,000
🍁దరఖాస్తు ఇలా చేయాలి
🔸ఏపీజీఎల్ఐ దరఖాస్తును ఆన్లైన్లో పంపవచ్చు. శాఖాధికారి ధ్రువీకరణ పత్రంతోపాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు పూర్తి చేసిన ఆన్లైన్ పంపవచ్చు లేదా కార్యాలయంలో అందజేయవచ్చును. ప్రభుత్వ ఉద్యోగి పాలసీ తీసుకోవాలంటే 21-55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పాలసీ తీసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏపీజీఎల్ఐ శాఖ పాలసీ బాండ్లను వారు పని చేస్తున్న శాఖాధికారుల ద్వారా పంపిస్తుంది. లేకుంటే ఆన్లైన్లోనే బాండు తీసుకోవచ్చు. ఈ బాండు పొందిన పాలసీదారులకు ప్రమాద బీమా ఉంటుంది. బాండు పోతే డూప్లికేట్ బాండు పొందిన తర్వాతనే పరిహారం ఇస్తారు.
🍁ప్రయోజనాలు ఎన్నో
🔸ప్రతీ వెయ్యి రూపాయల పాలసీకి రూ.100 చొప్పున ప్రతిసంవత్సరం బోనస్ జమ అవుతుంది.
🔹ఉద్యోగ విరమణ చేసిన తరువాత పాలసీ మొత్తంతో పాటు ఆ సమయంలో అమల్లో ఉన్న బోనస్ను ఉద్యోగి ఖాతాకు జమ చేస్తారు.
🔸ఇన్కంటాక్సు మినహాయింపు పొందవచ్చును. సెక్షన్ 80 (సి) ప్రకారం ప్రీమియం సొమ్ము నమోదు చేయాలి.
🔹ఉద్యోగి దురదృష్టవశాత్తు మృతి చెందితే తీసుకున్న పాలసీ మొత్తంతో పాటు అంతవరకు ప్రకటించిన బోనస్ను కూడా ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు.
🔸ఉద్యోగి మరణించిన తర్వాత ప్రీమియం కట్టనవసరం లేదు.
🔹పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణాలు, వాహనాలు, గృహాల కొనుగోలు వంటి పలు రకల అవసరాల కోసం పాలసీల నుంచి అప్పు తీసుకోవచ్చు.
🔸కట్టిన పాలసీలో 90 శాతం వరకు రుణం పొందవచ్చు.
🔹కేవలం 9శాతం వడ్డీకి మాత్రమే రుణ సదుపాయం కల్పించారు.
🔸నెలనెలా జీతంతో పాటు రుణ బకాయిల సొమ్మును జీతం నుంచి మినహాయించి సంస్థకు చెల్లిస్తారు.