వ్యాసకర్త పక్కా సెక్యులర్ వాది కాబట్టే ఇంత తెగించి విమర్శలు చేశారని అంటారేమో! ఒక సాదాసీదా ఉపాధ్యాయ నాయకుడు జాతీయస్థాయిలో ఒక అంశంపై విశ్లేషణ చేయడం పెద్దగా చాలా మందికి రుచించకపోవచ్చు. కానీ వ్యాసం పూర్తిగా చదవండి. వాస్తవాలు నాపట్ల మీ విశ్వసనీయతను మరింత పెంచుతాయి. నా భావనలు ఈ జాతికి జరిగిన అన్యాయాన్ని తేటతెల్లం చేస్తాయి.
మన దేశంలో తొలిసారి కరోనా వచ్చినట్లే, ప్రపంచపు నలుమూలలను తాకింది. క్యూబా తప్ప అన్ని దేశాలు ఈ అపదను చవిచూసాయి. ప్రపంచ దేశాలను శాసిస్తున్న అమెరికాను కూడా కరోనా ఒణికించింది. తొలి దశలో భారత్ కూడా ఆ తాకిడిని చాలా వరకు తట్టుకుంది. 2019 ప్రథమార్థంలో దేశ అభివృద్ధి సూచీలు పతనమై పారిశ్రామిక మందగమనం, ధరలను పరుగులు పెట్టించింది. దేశ వ్యాప్తంగా కుటుంబాలు కొనుగోలు సామర్ధ్యం కోల్పోయి కోలుకోలేని దెబ్బ తీయడం వెనుక వైఫల్యానికి కారణమెవరో తర్వాత అవగతమౌతుంది. కరోనా విజృంభించడానికి కారణం దాని గొప్పతనం కాదు... ప్రజల దేహంలో దానిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేకపోవడం. మంచి ఆహారం లేకపోవడం. ఈ ఉత్పాతాన్ని పసిగట్టిన దేశాల అధినేతలు రెండో దశను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహం రచించారు. ఫైజర్, స్పుత్నిక్, సీరం, భారత్ బయోటెక్ వంటి అనేక వ్యాధి నిరోధక టీకాలపై ప్రయోగాలు చేస్తున్న సంస్థలకు ఇతోధికంగా ఆర్ధిక సహకారాన్ని అందించి ముందస్తుగా టీకా దోషులకు అడ్వాన్స్ చేసింది. ఏ దేశంలో అయితే టీకా ఉత్పత్తి సంస్థలున్నాయో ఆ దేశం ఉత్పత్తులను ఒడిసి పెట్టడంలో విఫలమైంది. ప్రపంచం మొత్తాన్ని తమ టీకా తో రక్షిస్తామని కొండంత ప్రచారం చేసిన ప్రధాని మోడీ ఈ దేశ ప్రజల ప్రాథమ్యాలను గుర్తించడంలో చేష్టలుడిగి వ్యవహరించారు. ఉత్పత్తి సంస్థల వెంటబడి ఉత్పత్తులను స్టాక్ పాయింట్లకు చేర్చుకున్నారు. వారు దేశాధినేతలుగా కాదు రాత్రి0బవళ్ళు కార్మికులుగా కాపలా కాచారు. అంతేకాదు టీకా వస్తున్న విషయాన్ని, టీకా వలన ప్రయోజనాలను దేశదేశాలు తమ ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. అందువల్లే ఆయా దేశాల ప్రజలు టీకా రాగానే వెంటబడి వేయించుకున్నారు. అదే భారతదేశంలో చైతన్యం కొరవడి టీకా వేసుకోవడానికి వెనుకంజ వేశారు. టీకా తమ ఆరోగ్యం చెడగొడుతుందని భ్రమ పడ్డారు. ప్రభుత్వం మాస్కు వేసుకోమంటే వేసుకున్న, శానిటైజర్ పూసుకున్న, భౌతిక దూరం పాటించిన, గొడుగులు వేసుకొని తిరిగిన, రాత్రి పూట లైట్లు వేసిన, పళ్ళాలపై గంటెలతో కొట్టి శబ్దాలు చేసి ఆశాస్త్రీయ వైఖరులను అవలంభించిన ప్రజలు టీకా జోలికి ఎందుకు వెళ్ళలేదు.? టీకా వేసుకోవడాని కి ఎందుకు భయపడ్డారు? అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు టీకా వేయించుకోవాల్సిందిగా తమ సిబ్బందిని వెంటబడి తరిమాయి. ప్రతిరోజూ టార్గెట్లు ఇచ్చినా వైద్యులు, ఇతర సిబ్బంది బ్రతిమాలినా ప్రజలు ఒక పట్టాన టీకా వేయించుకోవడానికి మొండికేశారు. ఇది ఎవరి వైఫల్యం? టీకా యొక్క ప్రయోజనాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో మన్ కీ బాత్ ఏమైంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దశలోనే ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల పైచిలుకు ప్రాణాలు గాల్లో కలసి పోయాయి. రోజూ 4 లక్షల మంది రోగానికి గురవుతున్నారు. ఆత్మనిర్బర్ భారత్ అంటూ ఉపన్యాసాలతో చెలరేగిన ప్రధాని రాబోయే విపత్తును పసిగట్టడంలో ఎందుకు సఫలం కాలేదు. 137 కోట్ల ప్రజానీకానికి అవసరమైన టీకాల గురించి అంచనా వేయలేకపోయారు. దేశీయ టీకా ఉత్పత్తి సంస్థలైన సీరం, భారత్ బయోటెక్ లతో తగిన స్థాయిలో సంప్రదింపులు జరపడం లో నిర్లిప్తత ప్రదర్శించారు. ఆ రెండు సంస్థలు ఏడాదికి 16 నుంచి 20 కోట్ల డోసుల సామర్ధ్యం కలిగివున్నాయి. ఆ లెక్కన ఒక్కో మనిషికి రెండు డోసుల లెక్కన 137 కోట్ల ప్రజానీకానికి 274 కోట్ల డోసులు అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగంటే నాలుగు కోట్ల డోసులను కొనుగోలు చేసింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేలా ఆయా సంస్థలకు సంస్థాగత పునరుత్తేజానికి సహకరించిందీ లేదు. కనీసం ఎగుమతులపై నిషేధం విధించే ప్రయత్నం చేయలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అనేక దేశాలు ఉత్పత్తిని ఎగరేసుకుపోయాయి. తమ దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చి 50% ప్రజలకు టీకా వేయించడంలో సఫలమయ్యాయి. ఇజ్రాయెల్ 52.6% ప్రజలకు టీకా వేయించగా ఇండియా కేవలం 2.5 శాతం మందికి మాత్రమే టీకా వేయించారు. తీరా ఉపద్రవం ముంచుకొచ్చాక ప్రజలు టీకా కోసం వెంటపడుతుంటే టీకా లభ్యత లేదు. మరి ఈ లెక్కన దేశ ప్రజలందరికీ వేక్సిన్ వేయించాలంటే ఎంత కాలం పడుతుంది? ఈ లోపు మరిన్ని లక్షల ప్రాణాలు పోవాలి?
విశాఖ ఉక్కును ప్రయివేటీకరించడంలో చూపిన చొరవ వేక్సిన్ ఉత్పత్తిలో చూపకపోవడం ఔచిత్యం ఏమిటి?
ఇదిలావుండగా అసలు రెండో దశ కరోనా వ్యాప్తికి కారణమేంటి? కారకులెవరు? ఒకసారి పరిశీలిస్తే
1. ఎన్నికలు
2. కుంభమేళా
3. ప్రజల్లో చైతన్య లేమి
4. దేశంలో వైద్య వసతుల కొరత
5. ప్రభుత్వ నిర్లిప్తత
6. ప్రధానమంత్రి రాజకీయ లబ్ధిపై చూపిన ఉత్సాహం ప్రజారోగ్యంపై చూపకపోవడం.
కరోనా తొలి దశ ప్రారంభ సమయంలో ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలను ప్రచారమాధ్యమాలు, కొన్ని మత సంస్థలు తూర్పారబట్టాయి. జాతిని రెండుగా చీల్చాయి. ఒక వర్గం ఆత్మనూన్యతా భావంతో సాటివారికి ఎదురు పడలేక సిగ్గుతో తలదించుకున్నారు. మరి కరోనా విలయం ముంచుకొస్తున్నా 70 లక్షల ప్రజలకు కుంభమేళాకు అనుమతించిన ఈ ప్రభుత్వాలను ఏమనాలి? రెండువేల మంది ఒకచోట ప్రార్ధనా సమావేశం నిర్వహిస్తే కోతలు బద్దలయ్యేలా వార్తలు ప్రసారం చేసిన టీ వీ చానెళ్లు 70 లక్షల మంది ఒక చోట చేరితే గొంతెత్తకపోవడానికి కారణమేమిటి? ఐదు రాష్ట్రాల ఎన్నికల కేంపయిన్ కోసం ప్రధాని ప్రచార సభలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు ర్యాలీలతో హోరెత్తించారు. కోర్టులు మొత్తుకొంటున్నా కరోనా వ్యాప్తికి తమ వంతు కృషి చేశారు.
ఇపుడు ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తోంది. ప్రజల దైన్యాన్ని గమనించి అవసరమైన సహాయాన్ని పంపుతున్నాయి. త ప్రధాన మంత్రి ప్రపంచం మొత్తాన్ని టీకా తో జాపడతానని ఊదరగొడితే దేశాధినేతలు భారతీయుల దయనీయ స్థితి చూసి ఆందోళన చెందుతున్నారు. శవాల గుట్టలను చూసి కళ్ళు చెమరుస్తున్నారు. కాలుతున్న దేహాలను చూసి జాలి పడుతున్నారు. ప్రచార పటాటోపం చూసిన వివిధ దేశాధినేతలు ఇక్కడి వాస్తవ పరిస్థితిని చూసి నిశ్శబ్ద0గా సహాయాన్ని వాహనాల్లో పంపుతున్నారు. అది ఆక్సిజెన్ కావచ్చు... మందులు కావచ్చు... ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు కావచ్చు... భారతీయ ప్రజల ప్రమాదకర స్థితికి చలించిపోతున్నారు.
వనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉండీ 137 కోట్ల ప్రజలు నిట్టూర్పులు విడుస్తున్నారు. వాస్తవానికి ప్రధాని మోడీ తెలివి లేని వారు కాదు. తెలివిగా ఆలోచించడంలో విఫలమయ్యారని ప్రపంచ మేధావి వర్గం ఒక్క గొంతుతో అరుస్తోంది. 137 కోట్ల ప్రజలను తమ గొడుగు కిందకు తెచ్చుకున్నామనే రాజకీయ భ్రమల్లో మునిగితేలిన దేశాధినేత ఈ ఉత్పాతానికి బాధ్యత వహించాల్సిందే!
ఫలితం .... రెండు లక్షల ప్రాణాలు బలి
ఇంకెందరు బలి కావాలి?
ముందుచూపులేక బరితెగించి పాలకులను ఇంకెంత కాలం భరించాలి? తప్పిదాలను మూసి పెట్టడానికి ఉచిత బియ్యం పంపిణీ తెర పైకి తెచ్చిన పాలకుల కుహనా పాలనను ఏమనాలి? దేశాధినేత కార్యశీలతపై శ్లోకించి సుప్రభాత వీచికలు విసిరిన ఆయన అనుంగులు జరుగుతున్న నష్టానికి సమాధానం ఏం చెబుతారు? ప్రాణాలు పోయే వారికి ఆక్సిజన్ కావాలి, వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రులు కావాలి, వైద్యం చేయడానికి వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు కావాలి. ఆస్పత్రుల సంఖ్య పెరగాలి. మరి పొయ్యి మీద ఎసరు పెట్టుకోలేక, చచ్చే ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బియ్యం కొసరు ఎందుకో?
కోవిడ్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయాలి. వ్యాధి సోకిన వారికి వేసుకోవాల్సిన మందులు, వ్యాధి పీడితులు తినాల్సిన ఆహార పదార్థాల చిట్టా ఆహారం గురించి కరపత్రాలు ప్రింట్ చేసి పంపిణీ చేసే స్థాయికి ప్రభుత్వ కార్యస్థితి దిగ జారిందంటే...ఇక...
జన చైతన్యమే భావి భారతానికి రక్ష!. ఈ దేశానికి వైభవం రావడానికి ఒకటి రెండు దశాబ్దాల పాటు వెనుక వరసలో నిలబడాల్సిందే!
-మోహన్ దాస్. ఎన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్