APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF VOICE » ప్రభుత్వానికి శతాధిక నమస్సులు! -మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్

ప్రభుత్వానికి శతాధిక నమస్సులు! -మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్

Posted by APTF 1938
» APTF VOICE
» Thursday, 1 December 2022

  •  ప్రభుత్వానికి శతాధిక నమస్సులు!
  • - ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్!
  • - అయినా ముంజేతి కంకణానికి అద్దమేల?


ఎట్టకేలకు ఉపాధ్యాయులకు స్వాతంత్ర్యం వచ్చింది. కట్టుబానిసత్వపు సంకెళ్ళు తెగాయి. కొన్ని దశాబ్దాల బా(ధ)ధ్యతల నుండి ఉపశమనం లభించింది. ఒకరకంగా చెప్పాలంటే ముక్తి దొరికింది. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ వచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మకం. ప్రభుత్వాధినేతలకు ఉపాధ్యాయలోకం మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తోంది. ఇప్పటివరకు అనుభవిస్తున్న ఇబ్బందులు సునాయాసంగా మరిచిపోయారు. బోధనేతర విధుల నుండి తప్పించడం ద్వారా ఉపాధ్యాయులు పూర్తి సమయం బోధనకు కేటాయించే వీలుదొరుకుతుందని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ఎన్నికల నిర్వహణ, జనగణన విధులు బోధనకు పెద్దగా ఆటంకం కల్పించేవి కావు. అంతకంటే భయంకరమైన పనులు ఉపాధ్యాయులను బెంబేలెత్తిస్తున్నాయి. క్షణం తీరికలేని పనులెన్నో పాఠశాల ప్రాంగణంలోనే మకాం వేసివున్నాయి.  అవేంటో, బోధనా సమయాన్ని ఎంతగా కుంగదీస్తున్నాయో అటు ప్రభుత్వానికి, ఇటు ఉపాధ్యాయులకూ తెలుసు. అయినా రాత్రికి రాత్రే విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలనే తలంపు రావడం వెనుక మతలబు వేరుగా ఉందన్నది జగమెరిగిన సత్యం.  ఇటీవలికాలంలో ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి పెద్దగా పొసగడం లేదు. పీఆర్సీలో కుదింపులు, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం వెనకడుగు వేయడం, దీర్ఘకాలికంగా డీఏలు పేరుకుపోవడం వంటి ఆర్థిక సమస్యలతో పాటు, ఆర్థికేతర అంశాలైన బదిలీలు, జీఓ 117 ద్వారా పాఠశాలల మెర్జింగ్, సొంత సెల్ ఫోన్లో పేసియల్ యాప్ వినియోగంపై ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరించింది. ఈ విధానాలు  తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ప్రభుత్వ సాచివేత వైఖరితో ఉద్యోగ ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారు. అదే రెండువైపులా దూరాన్ని పెంచింది. 2019 ఎన్నికల నాటికి ఉద్యోగ ఉపాధ్యాయవర్గం తమను ఆదరించగా ఇపుడు క్షేత్రస్థాయిలో  వాతావరణం భిన్నంగా ఉండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే బోధనేతర విధి అనే కారణాన్ని తెరపైకి తెచ్చిందనేది నిర్వివాదాంశం. 


స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పంచాయితీ నుండి, పార్లమెంట్ దాకా జరిగిన అన్ని ఎన్నికలను 75% పైబడి ఉపాధ్యాయులే సిబ్బందిగా నిలబడి పనిచేశారు. కె

ఎంతో ఆత్మవిశ్వాసంతో ఓటింగ్ సందర్భంగా ఎదురైన సమస్యలను, గొడవలను పరిష్కరించుకొంటూ ఎన్నికల నిర్వహించారు. అనేక సవాళ్ళను సున్నితంగా సునాయాసంగా అధిగమించడం ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమైంది. కలుషిత వ్యవస్థల్లోనూ ప్రజాస్వామ్య మనుగడకు ప్రాణాలొడ్డే తత్వం వారిది. నిద్ర, ఆహారం, లేకున్నా ఓట్లను ఒడిసిపట్టి టార్గెట్ ను ఛేదించి నిర్ణీతకాలంలో ప్రజా నిర్ణయాన్ని వెలువరింపజేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం, అనన్యం, అద్వితీయం, అసాధారణం. వారు విలువలకు ప్రతిరూపం. విశ్వసనీయతకు సాక్ష్యం. వారెప్పుడూ, ఎక్కడా అవినీతికి, అక్రమాలకు పాల్పడిన దాఖలాలు సూన్యం. రూకలకు మొకరిల్లిన సందర్భాలు అసల్లేవ్. ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇదొక ప్రధాన ఉపశమనం. ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులెప్పుడూ ఎన్నికల చిహ్నాలు చూడరు, పోటీ చేసే అభ్యర్థుల గురించి అసలు పట్టించుకోరు. వారికి తెలిసిందల్లా సకాలంలో ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకోవడమే. ప్రేరేపిత

గొడవలు జరిగినా, తలలు పగిలినా, బూతుల అక్రమించినా, నిబంధనలను అతిక్రమించినా, కొన్నిసార్లు ప్రాణాలు పోయినా బ్యాలెట్ పెట్టెను అందులోని ఓట్లను భద్రంగా రిటర్నింగ్ అధికారికి చేర్చి అర్ధరాత్రో, అపరాత్రో ఇంట్లకు చేరిన ఓర్పు, నేర్పు ఉపాధ్యాయుల సొంతం. అక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ కోసం మొహం వాఁచి ఎవరూ వెళ్లరు. అసలు వారి శ్రమను రూపాయల్లో కొలవలేరు.  అదొక బాధ్యత.  ఒకటికి శిక్షణలతో 5 రోజులు కుటుంబాలకు దూరంగా క్రమశిక్షణ తో యజ్ఞంలో సమిధల్లా చేసిన సేవలకు ఇపుడు అటవిడుపు లభించడంతో ఉపాధ్యాయుల నుండి కేరింతలు వినబడుతున్నాయి. 


భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ  324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. ఉపాధ్యాయులను పాఠశాలలు జరిగేరోజుల్లో ఎన్నికల విధుల పేరుతో బోధనకు దూరం చేయొద్దని ఎన్నో ఏళ్లుగా అటు కోర్టులు, ఇటు సంఘాలు కోరుతూవున్నాయి. అందుకోసం అనేక వ్యాజ్యాలు కోర్టుల్లో నడిచాయి. తదనుగుణంగా తీర్పులు వెలువడ్డాయి. 2007లో సుప్రీంకోర్టు ఆమేరకు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మధ్యప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఆ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ను సమర్థిస్తూ  2022 జులైలో కోర్టు తీర్పునిచ్చింది. 2019లో రాజస్థాన్ లో పార్లమెంట్ ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులకు వెసులుబాటు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్నికల విధులకు హాజరు కాలేమని కొందరు ఉపాధ్యాయులు విన్నవించినా బిహార్లో వారికి ప్రభుత్వం సమన్లు జారీచేసిన సందర్భంలోనూ పాట్నా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. 2017 మీలో బాంబే హైకోర్టు, 2021లో అలహాబాద్ హైకోర్టు, 2011లో మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, బోధనకు ఆటంకాలు కల్పించవద్దని తీర్పు మీద తీర్పు ఇచ్చినా నిన్న మొన్నటి వరకు వారి సేవలను అనేక యాక్టులను బూచిగా చూపి నిర్బంధంగా వినియోగించుకోవడం చూసాం. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను కొన్ని ఎన్నికల విధుల నుండి తప్పించింది. ఎఫ్ నెం. 1-3/2010 భారత ప్రభుత్వ చట్టంలోనూ ఈ మినహాయింపులున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ని అనుసరించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ఆర్టికల్ 45, ఆర్టికల్ 21 అనుసరించి  ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో నియమించరాదనే వాదనతో సుధీష్ సోమన్ అనే పౌరుడు 2010 అక్టోబర్లో కేరళ ఎన్నికల కమిషన్ పై వేసిన దవాలో 23 డాక్యుమెంట్లను సమర్పించడం జరిగింది. ఆమేరకు అయినప్పటికీ అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని సైతం వదలకుండా విధులకు నియోగించిన ప్రభుత్వం, కరోనాతో ప్రాణాలకు పెను ప్రమాదం పొంచివున్నా ఎన్నికల విధుల్లో నియోగించిన ప్రభుత్వం ఇపుడు మనసు మార్చుకోవడం శుభపరిణామం. ఇది కూడా మనకు మంచిదే!  



ఏదిఏమైనా పాలకులు అభద్రతా భావానికి గురయ్యారనేది విస్పష్టం. వాస్తవం ఏంటో ఎవరూ ఎరుగరు. ఉపాధ్యాయులు తమ ఓటును కూడా తాము వేసుకోలేని స్థితి. ఓటెవరికి వేయాలో కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని స్వచ్ఛత. అయినా   ఉపాధ్యాయులను నిర్ణయాత్మక శక్తులుగా గుర్తించారు. వారి శక్తియుక్తులు ఫలితాలను ప్రభావితం చేయగలరనే సంశయం తలెత్తింది. మరి అలాంటి వారు బయటవున్నా, లోపల వున్నా భూగర్భంలో దాచినా చేయగలిగింది చేయక మానరు కదా! ఉపాధ్యాయులు లేని ఎన్నికల నిర్వహణ కూడా ఒక చరిత్రే! ప్రజాస్వామ్యమనే ఆకాశ హర్మ్య సౌధానికి రందులద్దగలిగిన ఉపాధ్యాయవర్గానికి మరకలు అంటకుండా ఇదొక అవకాశం.


సర్వేజనా సుఖీభవన్తు!

-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938.

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |