🔳మాకూ బదిలీలు కావాలి
29-06-2019 08:26:28
సర్కారును కోరుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
మూడేళ్లుగా జరగలేదు
2020లో హౌస్హోల్డ్ సర్వే.. 2021లో జనాభా లెక్కలు
వచ్చే రెండేళ్లలో అవకాశం ఉండదు
బదిలీల కోసం ఎదురుచూస్తున్న 13 వేల మంది టీచర్లు
ఈ ఏడాదే చేయాలని విజ్ఞప్తి
విజయవాడ: ఉపాధ్యాయులకు మూడేళ్లుగా బదిలీలు లేవు. వచ్చే రెండేళ్లలో జరిగే అవకాశమూ లేదు. ఈ ఏడాదే తమనూ బదిలీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావించారు. కానీ వారి ఆశ తీరలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇతర ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో విడుదల చేసింది. విద్యా సంవత్సరం మొదలైందన్న కారణంగా ఉపాధ్యాయులకు నో చెప్పింది. నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు చేసుకోవచ్చని పేర్కొంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యా యులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో ..
మారుమూల ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఈ ఏడాది తమకు బదిలీలుంటాయని ఆశగా ఎదురుచూశారు. భార్య ఒక చోట, భర్త మరో చోట దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు ఈసారితాము ఒక్క చోటే పనిచేసే అవకాశం వస్తుందని ఎంతగానో ఆశపడ్డారు. సర్కారు ఉత్తర్వులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. బదిలీలను పక్కన పెట్టి, ఉపాధ్యాయుల పదోన్నతలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు దక్కాల్సిన మంచి స్థానాలు పదోన్నతులు పొందిన వారు చేజిక్కించుకుంటున్నారని పలువురు ఉపాధ్యా యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా డీఎస్సీకి ఎంపికైన వారికి త్వరలోనే నియామకాలు పూర్తి చేయనున్నారు. వీరికీ మంచి స్థానాల్లోనే పోస్టింగ్లు దక్కుతాయని తర్వాత బదిలీలు చేపట్టినా ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందని ఉపాధ్యా యవర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం పదోన్నతుల కన్నా ముందుగా బదిలీలు జరపాలని వారు కోరుతున్నారు.
ప్రతిసారీ విద్యాసంవత్సరం మొదలైన తర్వాతే..
విద్యాసంవత్సరం మొదలైనందున ఉపాధ్యాయుల బదిలీలు జరపడం లేదని చెప్పడం హాస్యాస్పదమని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఉపాధ్యాయుల బదిలీలు ప్రతిసారీ విద్యా సంవత్సరం మొదలైన తర్వాతే జరుగుతూ వచ్చాయని వారు వివరిస్తున్నారు. 2005లో అక్టోబరులో ఉపాధ్యాయ బదిలీలు జరిగా యని, 2009, 2012లో జూలైలో, 2015లో నవంబరులో 2017లో జూలైలో బదిలీలు జరిగాయని వారు వివరిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తక్షణం ఉపాధ్యాయుల బదిలీలు చేయాలని వారు కోరుతున్నారు.
ఉపాధ్యాయుల్ని బదిలీ చేయాలి
ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే చేయాలి. మూడేళ్లుగా వారు బదిలీలకు నోచుకోలేదు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బం దులు పడుతూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించారు. ఈ ఏడాది బదిలీలు ంటాయని వారంతా ఆశగా ఉన్నారు. వచ్చే రెండేళ్లలో బదిలీలకు అవకాశం ఉండదు. తక్షణమే బదిలీలు చేపట్టాలి.
ఎస్.పి. మనోహర్ కుమార్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
బదిలీలకు నో చెప్పడం సరికాదు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు మాత్రం ఒప్పుకోకపోవడం అన్యాయం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షా 80 వేల మంది ఉపాధ్యాయులను తీవ్రంగా ఆందోళనపరుస్తోంది. వచ్చే రెండేళ్లలో బదిలీలకు అవకాశం ఉండదు. అందుకని ఈ ఏడాది బదిలీలు చేస్తారని అంతా ఆశగా ఎదురుచూశాం. ఉపాధ్యాయ బదిలీలపై సంఘాల డిమాండ్ను ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం దారుణం. పైగా ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ జారీ చేయడం కూడా ఉపాధ్యాయ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి