ఉపాధ్యాయ మిత్రులారా....
ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం అవుతున్న ఆనంద వేదిక అనే అత్యంత అద్భుతమైన కార్యక్రమానికి మనమంతా త్వరలో సిద్ధమవుతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి
1, 2 లెవెల్స్ (1,2 తరగతులకు మొదటి లెవెల్,3,4,5 తరగతులకు రెండో లెవెల్) ఉపాధ్యాయులకు కాగా, 3,4 లెవెల్స్ (6,7,8 తరగతులకు మూడో లెవెల్, 9,10 తరగతులకు నాలుగో లెవెల్) ఉన్నత పాఠశాల ఉపాధ్యాయు లకు నిర్దేశించబడినవి. ఉపాధ్యాయ శిక్షణలు ఇంత చక్కగా క్రమశిక్షణాయుతంగా, బాధ్యతాయుతంగా జరగడం చాలా సంతోషించాల్సిన విషయం.
ఆనంద వేదిక కార్యక్రమాన్ని భూటాన్ దేశపు స్ఫూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఈ కార్య క్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం తమ పాఠశాలల్లో హ్యాపీ నెస్ కరికులం పేరుతో అమలు చేస్తోంది. అద్భుత విజయాలను సాధిస్తోంది. ఢిల్లీలో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. విద్యా ర్థుల, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల మన్ననలు అందుకుంటోంది. మన రాష్ట్ర పరిస్థితులకు, అవస రాలకు అనుగుణంగా ఈ విధానంలో కొద్దిపాటి చేర్పులను చేశారు. నిజానికి ఆనంద వేదిక కేవలం ఒక పాఠశాల కార్యక్రమం కాదు. ఒక సమర్థమైన, సంతోషకరమైన జీవన విధానాన్ని నేర్పే ప్రక్రియ.
సమాజంలో నానాటికీ కొరవడుతున్న విలువలు, నైపుణ్యాలు, సంతోషం పునరుద్ధరించ బడే లక్ష్యంతో ఆనంద వేదిక కార్యక్రమం రూపు దిద్దుకొంది.
పాఠశాలలో మొదటి అరగంట ఆనంద వేదిక కోసం నిర్దేశిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి పుస్తకాలు గానీ, వ్రాతపని గాని ఉండవు. వారు నేర్చుకుంటున్న విలువలు లేదా నైపుణ్యాలను సాధన చేయడం మాత్రమే ఉంటుంది. అవి కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతాయి. విద్యార్థులను ఆనంద పరవశుల్ని చేస్తాయి. ఇందులో కథలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. కథలు జీవన విలువలు నేర్పిస్తాయని మనందరికీ తెలుసు. అదేవిధంగా జీవితంలో కొన్ని సంఘటనలను విశ్లేషించడం ద్వారా పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విజయవంతమైన మనోవైజ్ఞానిక సూత్రం ద్వారా ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. ఏకాగ్రత(mindfulness), 9 విలువలు,
9 నైపుణ్యాలు ఆనంద వేదికలో ప్రధాన అంశాలు. ఈ కార్యక్రమం నాలుగు లెవెల్స్ కు నాలుగు హ్యాండ్ బుక్స్ ఉపాధ్యాయుల కోసం సిద్ధం చేశారు. ఎంతో సులభంగా, ఆనందంగా, ఎటువంటి గందరగోళం లేకుండా విద్యా సంవత్సరంలో 36 వారాల పాటు అమలు చేయగలిగే ఈ విధానాన్ని శిక్షణ ద్వారా ఉపాధ్యాయులందరికీ అందిస్తారు.
మనం సంతోషించాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటంటే.... ఈ కార్యక్రమం రాష్ట్ర, జిల్లా అధికారుల మన్ననలను పూర్తి స్థాయిలో అందుకుంది. వారంతా మనస్పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నారు. వారితో పాటు నిరంతరం ఈ కార్యక్రమానికి విలువైన సూచనలిస్తూ మనోవైజ్ఞానిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్ సి ఈ ఆర్ టి, డైరెక్టర్, రాష్ట్ర అధికారులు, కోఆర్డినేటర్, జిల్లా అధికారులు మరియు టీం సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఎంతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కేవలం కార్యక్రమం కాదని ఒక జీవన విధానాన్ని నేర్పించే ఒక అద్భుత ప్రక్రియ అని మనస్పూర్తిగా చెబుతున్నారు. తమ ఆచరణ ద్వారా కూడా దీన్ని నిరూపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రిసోర్స్ పర్సన్లుగా నియమితులైన వారంతా స్పూర్తి దాయకం గా పనిచేస్తున్నారు. శిక్షణకు వచ్చిన డి ఆర్ పి లు ,మండల స్థాయిలో శిక్షణ ఇచ్చిన రిసోర్స్ పర్సన్స్ ఈ స్పూర్తిని మనసా వాచా కర్మణా స్వీకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కనుక క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అద్భుత విజయాలను సాధిస్తుందని, విద్యార్థులను ఉపాధ్యాయులను, యావత్ సమాజాన్ని జీవన నైపుణ్యాల, విలువల తీరం వైపు కు ఖచ్చితంగా తీసుకువెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సమాజం, పాఠశాల విద్యార్థుల పట్ల ప్రేమ, అంకిత భావం నిండుగా ఉండే ఉపాధ్యాయులు ముందుకు వచ్చి ఆనంద వేదిక పాఠశాల కోఆర్డినేటర్లుగా తమ పాఠశాలల నుండి ఈ అద్భుత యజ్ఞంలో భాగస్వామ్యం వహించవచ్చు. వీరికి జిల్లాలలో డి ఆర్ పి ,MRP ల ద్వారా సమగ్ర శిక్షణ అందించబడింది. తరువాత వీరు తమ పాఠశాలలో మిగిలిన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ అందిస్తారు.
పాఠశాలలో మొదటి పిరియడ్ గా, ఆనంద వేదిక కార్యక్రమానికి అర గంట సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకం చేస్తోంది. ఈ కార్యక్రమం అమలులో అందరు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా తరగతి ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు ఉంటాయి.
విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో మనో
వికాసాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మన రాష్ట్రంలో అమలయ్యే ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచే అవకాశం ఉంది.
*WISH YOU A HAPPY CURRICULUM*