*
నిజం నిష్టూరంగా ఉంటుంది. ఒక సమస్య వంద ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక సమస్య అనేక కొత్త పరిణామాలు సృష్టిస్తుంది. *అదే కరోనా* సంబంధీకులలో వ్యతిరేక భావనను కలిగించవచ్చేమో గానీ ప్రపంచ వ్యాప్త మృత్యుఘోష నేపధ్యంలో నా వ్యాసం జనచైతన్యం కోసం మాత్రమే విడుదల చేయబడింది. ఈ రోజున్న పరిస్థితి దృష్ట్యా భారతదేశ పౌరుల అభద్రతా భావం అయోమయానికి గురిచేస్తోంది.
స్వాతంత్ర్యానంతరం ఉన్నత విద్య, ఉపాధికోసం, ఉద్యోగం కోసం, ఉన్నత జీవనం కోసం భారతీయ జనాభా వివిధ దేశాలకు వలస వెళ్లడం, తదనంతరం ఎదురౌతున్న గడ్డు పరిణామాలపై నేను స్థూలంగా విశ్లేషించదలచుకున్నా.
భారత దేశం సంపూర్ణ మానవవనరులున్న దేశం. అలాగే భౌతికంగా అపారమైన సహజ వనరులు గలిగిన దేశం కూడా. అయితే ఈ వనరులను వినియోగించుకోవడంలో పాలకులు గడిచిన 7 దశాబ్దాల కాలంలో తగిన కృషి జరపని కారణంగా పెద్దయెత్తున విదేశాలకు వలసబాట పట్టారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వైద్యం, శాస్త్ర సాంకేతిక అంశాల్లో విద్యాభ్యాసం చేసినవారు ఆ రుణం తీర్చుకోకుండానే మెరుగైన సంపాదన కోసం తొలుత వ్యక్తులు గానూ, తదుపరి కుటుంబాలకు కుటుంబాలే తరలిపోయ్యాయి. విదేశాల్లో శాశ్వత నివాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, స్వదేశానికి అతిధులుగా మారిపోయారు. భారతీయ జనాభా విదేశాల్లో ఉద్యోగాలు పొందితే విదేశీ మారకద్రవ్యం లభించి రూపాయి విలువను కట్టుదిట్టం చేయవచ్చని పాలకుల్లో ఆశ కలిగింది. విదేశాలకు వెళ్ళిన వారు ఆర్జించిన సంపదను అక్కడే పెట్టుబడులుగా మార్చి పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందడంతో ప్రభుత్వం ఆశలు అవిరయ్యాయి. అంతటితో ఆగకుండా అక్కడ పరిపాలనలోనూ భాగస్వామ్యం సంపాదించే పనిలో పడ్డారు. భారత్ నుంచి విదేశాలకు తరలివెళ్లిన సందర్భంగా విధివిధానాల రూపకల్పనలో తగిన శ్రద్ద చూపకపోవడంతో భారీ మూల్యం చెల్లించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వృద్ధుల పునరావాస కేంద్రంగా మారింది.
జనాభా పరంగా 131.2 కోట్లకు చేరిన భారత్ త్వరలో 140 కోట్ల చైనా బెంచ్ మార్కును దాటే రోజు దగ్గలోనే ఉంది. అయితే 80 శాతానికి పైబడి గ్రామీణ నాగరికత ఉన్న ఈ దేశంలో శుభ్రత, అక్షరాస్యత ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. అందువలన ఉద్యోగితలో 72 దేశాలను పరిశీలిస్తే అట్టడుగు నుంచి 10 వ స్థానంలో అంటే పైనుంచి కిందకు 62వ స్థానంలో వుండడం బట్టి నిరుద్యోగం ఎంతగా ఇబ్బంది కలిగిస్తున్నదో చూడొచ్చు. మెక్సికో, శ్రీలంక, ఫిలిప్పీన్స్ లాంటి చిన్న దేశాలు 96, 95, 94 శాతం ఉద్యోగిత కలిగివుండడం బట్టి మన స్థానం ఎక్కడో చూసి అనేక వర్ధమాన దేశాలు మనల్ని ఎగతాళి చూపులు చూస్తున్నాయి. నిరుద్యోగిత విషయం లోనూ 6.1% (45 సం౹౹ల లోపు వయస్సున్న వారు) ఉండగా 7.8% మహిళలు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. అదే విషయంలో అమెరికా కేవలం 3.5% నిరుద్యోగిత ఉండడం గమనార్హం.
అంతేకాదు ఇక్కడ కనీస వేతనం 178 రూపాయలుండగా, కేవలం10 కోట్ల జనాభా కలిగిన అజర్బైజాన్ 145 రూపాయలతో భారత్ సరసన నిలబడివుంది. మైనస్ 26.8 శాతం జిడిపి కలిగిన వెనిజులా 2.5 లక్షల వేతనం పొందుతున్నారు. 90 వ దశకంలో రెండంకెల మైలురాయిని దాటే దిశగా గట్టి అడుగులువేసిన భారత్ జిడిపి ఇపుడు వెనిజులాతో పోటీ పడి 4.7 శాతానికి దిగజారడం, 9% జిడిపి నమోదుచేసి ఇథియోపియా, రువాండా 8.4%, భారత్ అండదండలతో నిలద్రొక్కుకున్న బంగ్లాదేశ్ 7.9 % అభివృద్ధితో దౌడు తీస్తోంది.
స్వదేశీ వనరుల వినియోగంకోసం విదేశీ పారిశ్రామిక వేత్తలు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. మరోవైపు దేశీయ పరిశ్రమలు ఒక్కటొక్కటిగా మూతపడుతున్నాయి. లాభాలతో తులతూగుతున్న పబ్లిక్ రంగ సంస్థల షేర్లు పరాయికరణ చెందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చెల్లింపు పరిమితి అతిక్రమించి అప్పులకు ఎగబడుతున్నాయి. ఈ స్థితి మిగిలిన ప్రపంచ దేశాలకు బాగా తెలిసింది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి మందగమనం భారత సమాజాన్ని అసహనానికి, విస్మయానికి గురిచేస్తున్నది.
భారత దేశంలో నిరుద్యోగంతో కూడిన ఆర్థికవృద్ధి క్రమంగా బలపడుతోంది. పురుష జనాభా యువజనుల్లో 17.4%(రూరల్), 18.7%(అర్బన్) యువతుల్లో 13.6%(రూరల్), 27.2%(అర్బన్) ప్రాతినిధ్యంతో నిరుద్యోగ సమస్య పట్టి పీడుస్తున్న నిజాన్ని నీతి ఆయోగ్ బయట పెటింది. ఈ లెక్కలన్నీ అక్షరాలు దిద్దిన వారివే. మరి చదువులేని, చదువుకొని వారి సంగతేమిటి? భారత్ వ్యవసాయాధారిత దేశం కాబట్టి సరిపోయింది కానీ, పూర్తిస్థాయిలో పారిశ్రామిక రంగంపై ఆధారపడివుంటే పరిస్థితి మరింత భిన్నంగా వుండేది.
ఈ ఇబ్బందుల నేపధ్యంలోనే భారతీయ జనావాసాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. పొట్టకూటి కోసం తమవారిని వదిలి ఖండాలు, సముద్రాలు దాటుకుని వెళుతున్నారు. అక్కడ వలస కూలీలుగా అతి తక్కువ వేతనాలకు పశువుల కాపర్లుగా, సర్వేంట్లుగా అసంఘటిత రంగాల్లో దయనీయ జీవితాలను గడుపుతున్నారు. జబ్బువస్తే ముందూ మాకు లేక, బాధలువస్తే పంచుకునే వారు కరువై, యజమానుల దయాదాక్షిణ్యాలపై జీవిస్తున్నారు. బ్రిటిష్ వారు దేశం నుంచి వెళ్లిపోయినప్పటికీ భారత దేశం అర్ధవలస రాజ్యాంగానే ఉండిపోయింది. ఫ్యూడల్ సంస్కృతి మాటున ప్రజాస్వామ్య పరదాల నుంచి పాలన సాగుతోంది.
ఇపుడు కరోనా వ్యాప్తి కూడా విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్న వారి మూలంగానే వ్యాప్తి జరుగుతున్నది. అందుకే ఈ వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. కరోనా భారత్ లో ప్రవేశించి ఉండకపోతే ఒక శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో ఏర్పడివుండేది. డిసెంబర్ నెలలోనే విదేశాల నుంచి రాకపోకలను నియంత్రించి ఉంటే ఒక్కటంటే ఒక్క కరోనా బాధితుడు వుండేవారు కాదు. ఒక్క రూపాయి కూడా అందుకోసం ఖర్చుచేయాల్సిన అగత్యం తటస్థించి ఉండేది కాదు. ప్రజలకు ఈ ఈతిబాధలు ఉండేవి కావు. ప్రపంచం మొత్తమ్మీద ఇండియాలో అతి తక్కువ పోసిటివ్ కేసులు నమోదై ఉండవచ్చు గాక ప్రజల్లో భయాందోళనకు కనీస కారణం కాకపోయి ఉండేది. స్వేచ్చాయుత జీవనంలో ఒడిదుడుకులు ఉండేవి కావు. ఇప్పటికైనా విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని జల్లెడపట్టడంలో ప్రభుత్వాల కృషిని అభినందించాల్సిందే!
ఈ ఉపద్రవం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు ముమ్మాటికీ సహకరించాల్సిందే. వివిధ శాఖల సిబ్బంది, అధికారులకు తోడుగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. ఇది మన సమిష్టి బాధ్యత. మన నిబద్ధతకు ఇదొక కఠిన పరీక్ష!