ఈఎస్సార్ నమోదు
గడువు ఈ నెల 25
♦ఆ తర్వాతే సీఎఫ్ఎంఎస్ పూర్తిస్థాయి అమలు
♦ఈనెల 5న హెచ్ ఓడీలతో సమావేశం
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ నమోదు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్సులు తదితరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (సీఎస్ఎంఎస్) ద్వారా విడుదల చేస్తుంది ఇందుకోసం హ్యుమన్ కేపిటల్ మేనేజ్మెంట్(హెచ్ సీఎం) అనే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదు ప్రభుత్వ శాఖల్లో ఈ విధానం అమలును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం మే ఆరో తేదీన నిర్వహించిన సమావేశంలో అన్ని ప్రభుత్వ విభాగాలు ఈ ఎస్సార్ నమోదు చేపట్టాలని, అందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన 11 రకాల అంశాల వివరాలు అప్లోడ్ చేయాలని సూచించింది అయితే కరోనా లాక్ డౌన్, సర్వర్ సమస్యల కారణంగా ఇప్పటి వరకు ఈ ఎస్సార్ నమోదు పది శాతాన్ని మించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎస్సార్ నమోదు గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువును ఈనెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన హెచ్ సీఎం విధానంలో ఉద్యోగులు, పెన్షనర్ల మొత్తం సర్వీస్, పదోన్నతులు, లోన్లు తదితర ఇతర వివరాలన్నీ ఉంటాయి. తద్వారా ఉద్యోగుల సమస్త సమాచారంతోపాటు చెల్లింపులు సరళతరంగా మారతాయి.హెచ్ సీఎం అమలుకు సంబంధించిన అంశాలపై ఈ నెల ఐదో తేదీన సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల సంబంధిత అధికారులు హాజరు కావాలని సూచించారు.