కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధుల వేతనాలు ఠ0చనుగా ఒకటో తేదీ బ్యాంకు అకౌంట్లలో చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు అందుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థాయికి చేరడం ఒక దురదృష్టకర సంఘటన. కొన్ని శాఖల ఉద్యోగులపై ఒకటో తేదీ అభిమానం చిలకరించారు. అంటే రాష్ట్రమంతా ఒక యూనిట్ గా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య కనిపించని విభజన రేఖను గీశారు. చెప్పకనే సగటు ఉపాధ్యాయులపై అవిశ్వాసం ప్రకటించిందీ ప్రభుత్వం. విచిత్రంగా ఉపాధ్యాయులకు నవంబర్ జీతాలు ఇప్పటికీ (డిసెంబర్ 9) కొన్ని జిల్లాల్లో జమ కానీ పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది కుటుంబాల్లో ఆర్ధిక దిగ్బంధనం ఏర్పడింది. కేవలం జీతాలపైనే జీవితాలను వెళ్లదీస్తూన్న కుటుంబాల్లోని పొయ్యిలో నుండి పిల్లి బయటకు లేవని స్థితి కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఒకటో తేదీ అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. కారణం కూటికి, గుడ్డకు సంబంధించిన అంశమే కాదు. గతకాలపు అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు. సకాలంలో చెల్లించకపోతే పరువునష్టం సమస్య. ఇల్లు గడవాలంటే జీతమే ఆధారం కావడం. ఆయా ఉద్యోగులపై ఒకరికి నలుగురు ఆధారపడి ఉండడం. ప్రభుత్వోద్యోగి అంటే ఒకప్పుడు సమాజంలో మర్యాద, మన్నన ఉండేవి. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వద్యోగులకు అప్పు పుట్టని స్థాయికి చేరింది. ఒక చులకన భావం ఆయా వ్యక్తుల చుట్టూ ఆవర్తనంలా ఆవరించింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ అవసరాలు తీరక ఆయా కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి కూడా! గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ తటస్థించ లేదు, 010 హెడ్ లేనప్పుడు కూడా ఒక్క మార్చి నెల జీతం తప్ప. ఏప్రిల్ నెల జీతాన్ని ఏప్రిల్ 24 నే (పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మరుసటి రోజు) చెల్లించేవారు. అంటే ఏప్రిల్ నెలలో 20 రోజుల తేడాతో రెండు జీతాలు అందుకునే వారు. ముందస్తు ఆడిట్ ఉన్న మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మాత్రమే వేతనాల చెల్లింపులో కొద్దిగా జాప్య0 జరిగేది.
అంతే కాదు....
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పనిదినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది అనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై వున్న గౌరవం. ఉద్యోగులను ఆంతగా ఆదరించారో చెప్పనలివి కాదు. 1956 నుండి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు ఆగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా స్వామిభక్తితో పని చేసారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవచూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రజలనాడిని, ప్రజా సమస్యలను పత్రికల్లో వచ్చే వార్తల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాలశాఖ ఉండేది. పత్రికలలో మూడు సెంటీమీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి. బాధితులకు సత్వరం న్యాయం జరిపించేవారు. మధ్యవర్తులు, సలహాదారుల పెత్తనం అసలుండేది కాదు. సంఘాల నేతలే అనుసంధానకర్తలుగా ఉంది స్తబ్దతను తొలగించేవారు. పీఆర్సీ చర్చలకు సైతం కాలయాపన ఉండేది కాదు. పాతికో పరకో ఎంతో కొంత తేల్చి ఉత్తర్వులను ఒకేసారి జారీచేసేవారు. కానీ ఇపుడు కాలం తలకిందులైంది. ప్రతి విషయాన్ని సమస్యగా చూపుతున్నారు. సున్నితమైన అంశాలను కూడా వివాదాస్పదం చేస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలపై వాయిదాల పర్వము కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. చివరకు బాండ్లు ఇచ్చే సంస్కృతి ఆరంభమైంది. పదవీకాలం పూర్తయిన వారి చెల్లింపులకు నిధులు లేక ఉద్యోగ విరమణ వయసును సైతం పెంచుకొంటూపోవడం ఇటీవలి కాలపు పాలకులకు అనవాయిథీ అయింది. తమ సమస్యలను ప్రస్తావించదానికి కూడా అవకాశం లేదు. ఆందోళనలు చేస్తే ఇంటిదగ్గరే అరెస్టు చేస్తారు. పని చేస్తున్న చోటనే అదుపులోకి తీసుకొంటున్నారు. కనీసం స్వాతంత్య్రం సాధించుకున్న మార్గంలో ఒక ధర్నా చేసే వీలు లేని పాశవిక విధానాలకు పాలకులు అంకురార్పణ చేశారు.
ఒకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న అవిభక్త రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి చవిచూసిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ విడిపోయిన తర్వాత 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ₹ 2,56,256 కోట్లకు చేరింది. (బహిరంగ రుణాలు, ఋణ వసూళ్లు, రెవెన్యు వసూళ్లు )
ఉద్యోగుల జీతాలు బడ్జెట్ కేటాయింపుల ఫరిధిలోనివే. ఏ రంగానికి సంబంధించిన ఆదాయాన్ని ఆరంగం కోసం కాకుండా వచ్చిన ప్రతి రూపాయినీ తాము నిర్ధేశించుకున్న పథకాలకు చేరవేస్తుండడంతో ప్రతీ నెలా అప్పులకు అర్రులు చచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. విద్యారంగానికి 30 వేల కోట్లు కేటాయించగా ఆ మొత్తం మూలధనంగా ఉండడం లేదు. అంటే బడ్జెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రాధాన్యతా రంగాలు అట్టడుగున చేరాయి. ఉత్పాదక రంగం కుదేలయింది. వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి సంక్షేమం అనే ప్రత్యామ్నాయ రంగాలు తెరపైకి వచ్చాయి. సంక్షేమం కాస్తా నగదు బదిలీగా రూపాంతరం చెందింది. ప్రభుత్వం ఒక్క ఉద్యోగుల విషయంలో మాత్రమే బీద అరుపులు అరుస్తోంది. బడ్జెట్ లో సగానికి పైగా 1,32,126 కోట్ల రూపాయలు వివిధ రకాల పధకాల కింద లబ్ధిదారులకు చేరుతోంది. ఇది నగదు పంపిణీకి దోహదపడుతుంది కానీ ఉత్పాదనను ప్రోత్సాహకం కావడం లేదు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవ రాబడిని గుర్తించకుండా కేంద్రం, ఇతర రూపాల్లో వచ్చే నిధులనే ఆదాయంగా భావిస్తున్నారు. తెస్తున్న అప్పులు, సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకున్న మొత్తాలు సైతం అప్పులు, అప్పులపై వడ్డీలు చెల్లింపుకు మళ్లిస్తుండడం చూస్తున్నాం. ద్రవ్యలోటుపై నియంత్రణ కోల్పోయింది. గణాంకాల్లో తలసరి ఆదాయం కనిపించినా వాస్తవ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు. 'Money is a terrible monster but an excellent servant. Rulers should keep in mind while expending every rupee.'
ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. రేపటి రోజున మరింత కష్టాలు ఎదురుకానున్నాయి. ఒక సమీకృత ఆర్థిక విధానం అవలంభిస్తే తప్ప రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రమాద ఘంటికల నుండి మనలను రక్షించలేవు . ద్రవ్యోల్బణం కొత్తపుంతలు తొక్కే ప్రమాదం ఉంది. పౌరులు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తున్న పధకాలను రుచించకుండా రాష్ట్ర భవిష్యత్తు ప్రామాణికంగా ముందుకు సాగాలి. అప్పులు చేసి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల స్వీయనిర్ణయాధికారంపై పునస్సుమీక్ష చేయాల్సిన అవసరం వుంది. దేశంలోని పౌరులను ఋణగ్రస్థులుగా మార్చే విధానాలను కట్టడి చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తు అగమ్య గోచరమౌతుంది.
భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఈ సందర్భంగా ఉటంకించక తప్పడంలేదు.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి” ఉద్యోగులుగా అంకితభావంతో పనిచేసుకుంటూ పోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఫలితాలు భవిష్యత్తులో అవిష్కృతమౌతాయి.
“A dream doesn't become reality through magic; it takes sweat, determination and hard work.” కేవలం జీతాల సమస్య గానే చూడలేం. ఇదొక విపత్కర పరిస్థితి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. ఒక మేధోమదనం జరగాలి. దుబారా ఆర్థిక విధానాలతో ఎన్నటికీ సత్ఫలితాలను పొందలేమనే వాస్తవాన్ని గుర్తించాలి.
-మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, #ఎపిటీఎఫ్_1938