ఉపాధ్యాయ బదిలీలకు శాశ్వత కోడ్ ఏర్పాటు చేయాలి!
బదిలీల ముసుగులో పోస్టుల రద్దు...
ఇదో పెద్ద కుంభకోణం....
(మోహన్_దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్_1938)
ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం పైలా (పెహ్లా) పచ్చీసు ఆడుతోంది. ఏదైనా ఒక వ్యవస్థలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేయాలని భావించినపుడు సంబంధీకులతో కనీస సంప్రదింపులు జరపడం ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు ఒకటిన్నర లక్షల పైచిలుకు ఉండగా వారిని బదిలీల్లో ప్రభావితం చేయడమంటే సామాన్యమైంది కాదు. కానీ ప్రభుత్వం చాలా ఆషామాషీగా తీసుకొంది. ప్రభుత్వంచేత కితాబు పొందాలని ఉవ్విల్లూరిన అధికారులు కూడా లేడికి లేచిందే పరుగుగా వ్యవహరించారు. ఈ వైఖరి ఇపుడు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను శాప గ్రస్థమ్ చేసింది.
బదిలీలు చేపట్టినా, రేషనలైజేషన్ చేసినా, పాయింట్లపై రాయబేరాలు నడిపినా, న్యాయపోరాటాలకు దిగినా, ఆందోళనలు చేపట్టినా అంతిమ లక్ష్యం విద్యార్థి, పాఠశాల మనుగడ అయి ఉండాలి.
అవన్నింటినీ గాలికి వదిలి రెండువైపులా స్వీయ ప్రయోజనాలే ప్రామాణికంగా ప్రాకులాడుతున్న క్రమాన్ని సామాజం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?
ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యలో కోత విధించాలని భావించవచ్చు. లాభాలు లేని వ్యవస్థగా క్రమేపి భారం తగ్గించుకోవాలని చూడకూడదు.
తడిసి మోపెడవుతున్న బడ్జెట్ ను అదుపుచేసే ప్రయత్నం కావచ్చు. ఉపాధ్యాయులను సాధింపులకు గురిచేసే ప్రయత్నమయినా, విద్యారంగాన్ని సంస్కరించాలనే విశాల ధృక్పధమైనా అయివుండాలి. వాస్తవానికి బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు శ్రేయోదాయకం. కానీ ప్రయోజనకరమైన విధానాలపై ఆసక్తి చూపని ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్న దశలో బదిలీల చేపట్టడంపై స్తబ్దుగా ఉండిపోయిన ప్రభుత్వం అకస్మాత్తుగా రేషనలైజేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం అసలు దాని ఆనవాళ్లు బయటికి పొక్కకుండా వివిధ రకాల సమస్యలకు ఆజ్యం పోసింది. బదిలీల పర్వ0లో ఒకనాటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇప్పటి కౌన్సిలింగ్ ప్రక్రియకు దోహదం చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఆ విధానంలోనే ఎన్నో బదిలీలు జరిగాయి. అయితే ఇప్పుడు ఎదురైనన్ని సందేహాలు ఎప్పుడూ తారస పడలేదు. ప్రభుత్వ కనుసన్నల్లో అధికారుల్లో ఉపాధ్యాయుల పట్ల ఏర్పడిన అణిచివేత అనే జాఢ్యం ఇపుడు తారాస్థాయికి చేరింది. అదే కౌన్సెలింగ్ విధానం ఈనాడు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ గా మార్పు చెంది ఉపాధ్యాయుల జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఉపాధ్యాయులను గ్రూపులుగా విడగొట్టింది, ఓకే స్కూల్లో పనిచేస్తున్న వారి మధ్య కూడా విద్వేషాలకు ఆజ్యం పోసింది. పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యా సంవత్సరం సంఘాలు వివిధ సమస్యలను ప్రస్తావించడం, వాటిపై సమావేశాలు నిర్వహించడం అందులో సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలపడం, తదనంతరం వాటిపై భిన్నమైన విధానాలు ప్రకటించడం, ఇచ్చిన జీఓ కు విపరీతార్ధం తీయడం. ఇలా గంటగంటకీ జాబితాలు మారుతున్న నేపధ్యంలో ఉపాధ్యాయులలో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల సంఘాల మాట చెల్లుబాటు కాకుండాపోయింది. ప్రభుత్వ అనుకూల సంఘాల సంగతి పక్కన పెడితే సామాజిక కోణంలో పనిచేస్తున్న ఏపిటీఎఫ్ లాంటి సంఘాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే జీఓ 117 పై అనుబంధ ఉద్యమ సంఘం విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా కోర్టులో కేసు నడుపుతోంది. ఉపాధ్యాయులను సంఘాలపైకి ఉసిగొల్పేలా చేసింది. సంఘాల మనుగడపై సవాలు విసిరిన దృశ్యం. సంఘాలను ఉనికిని ప్రశ్నార్ధకం చేసే కుట్ర ఇది.
గడిచిన వారం రోజులుగా వారికి కంటి మీద కునుకులేకుండా చేసింది. మొత్తానికి ప్రభుత్వ లక్ష్యం నెరవేరివుండొచ్చు గానీ విద్యావ్యవస్థ మొత్తాన్నీ త్రిశంకుస్వరంలోకి నెట్టబడింది. పాతిక వేలకు పైబడి ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పరిస్థితి నుంచి పాతిక వేల పోస్టులు మిగులు తేల్చే స్థాయికి ప్రభుత్వం చేసిన కసరత్తు ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పొంతన లేని విధానాల పుణ్యమా! అని అసలు ఒక సమగ్ర విధానమే లేకుండాపోయింది.
#ఉదాహరణకు
■ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు నియమిస్తాం - ప్రభుత్వం
√ నిజమే మెర్జ్ అయిన పాఠశాలలకు (3- 10 తరగతులు) మాత్రమే ఈ అవకాశం ఉంది.
× మరి 98 లోపు విద్యార్థులున్న పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లు అవసరం లేదా?
× ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు అక్కర్లేదా?
2021 కి ముందు ప్రాధమికోన్నత పాఠశాలలను బలోపేతానికి సబ్జెక్టు టీచర్ పోస్టులు కేటాయించిన ప్రభుత్వం ఇపుడు అక్కడ పోస్టులు రద్దు చేస్తూ జారీ చేస్తే ఆ ఉత్తర్వుల పాపం ఎవరిది?
13 లక్షలకు పైబడి ఉద్యోగులు, కార్మికులు ఉన్న రైల్వే శాఖలో కూడా బదిలీల్లో ఇంత అలజడి లేదు. ఒక్క రెండు లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులు, 3.25 లక్షల ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్న కర్ణాటకలోనూ ఎంతో హుందాగా సాగుతోంది. 3.57 లక్షల మంది మహారాష్ట్ర లోనూ, 3.31 లక్షల మంది రాజస్థాన్ లోనూ, 3.32 లక్షల మంది తమిళనాడులోనూ, ఉత్తర ప్రదేశ్ లో 2.17 లక్షలు, పశ్చిమబెంగాల్ లో 2.21 లక్షలు ఉపాధ్యాయులు సెకండరీ స్కూళ్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా ఇలాంటి రాద్దాంతం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ నిత్య గొడవేంటి? అందుకు ఒకసారి పూర్వాపరాలను సమీక్షించాలి.
జీఓ 117 పై ఇంకా తుది నిర్ణయం రాకముందే మాతృభాషలో విద్యాబోధన అనే అంశం హైకోర్టులో ఒక కొలిక్కి రాకముందే ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు తెరలేపడం సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చడమే! 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడం ఒక చారిత్రక తప్పిదం. దానిని సవరించకుండా ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే!
అందుబాటు అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరకుండానే చాలా స్కూళ్లకు గెడియలు వేసింది.
బదిలీలలో ప్రతి ఒక్కరినీ స్వార్ధం అనే కోరికను కొంత ప్రభావితం చేసింది.
అందువల్లే అందుబాటులో పాఠశాల ఉండాలనే సహజ కోరికతో అనేకమంది తమ కోర్కెలను సాకారం చేసుకునేందుకు కొందరు, తమ హక్కుల కోసం మరికొందరు
ఇపుడు న్యాయస్థానం తలుపులు తట్టారు. వందలాది మంది హైకోర్టులో కేసులు వేయడాన్ని బట్టి ఒక్క విషయం అర్ధమౌతోంది. బదిలీలు సజావుగా నిర్వహించాలనే ఆసక్తి ప్రభుత్వానికి లేదని. అర్ధవంతమైన ప్రతిపాదనలు అందులో లేకపోవడంవల్లనే ఉపాధ్యాయులు న్యాయం కోసం ఘోషిస్తున్నారనేది వాస్తవం. అందరికీ సహజ న్యాయం జరిపించాలనే స్పృహ అధికారులలో కొరవడింది నేపధ్యంలోనే సవాలక్ష సమస్యలకు అంకురార్పణ జరిగింది. అందువల్లనే అనేకమంది కోర్టుల్లో న్యాయం కోసం వ్యాజ్యాలు వేశారు. ఉపాధ్యాయుల జీవితాలు ఒక సమస్య నుంచి మరో సమస్యకు చేసే ప్రయాణంగానూ అతడో/ఆమె బాహుదూరపు బాటసారిగానూ మిగిలిపోతున్నారు.
√ స్పౌజ్ పాయింట్లు శాశ్వతంగా ఉపాధ్యాయులకు రద్దు చేయాలనే డిమాండ్
√ ప్రిఫరెన్షియల్ కేటగిరీ రద్దు చేయాలనే డిమాండ్
√ రేషనలైజేషన్ రద్దు చేయాలనే డిమాండ్
√ ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ రద్దు చేయాలనే డిమాండ్
√ ప్రమోషన్స్ వేకెన్సీ ఖాళీల ప్రదర్శన రద్దు చేయాలనే డిమాండ్
√ ఒక ప్లేస్ లో నియామకం పొందిన తర్వాత అక్కడ 8 సం౹౹ కొనసాగించాలనే డిమాండ్
√ రేషనలైజేషన్ పాయింట్ల విధానం రద్దు డిమాండ్
√ సీనియర్లకు కూడా న్యాయం చేయాలని డిమాండ్
ఇలా ఎన్నో పొంతన లేని, సానుకూల డిమాండ్లతో అనేక గొంతుకలు ఘోషిస్తున్నాయి. బదిలీల దరఖాస్తుల వల్ల
తమకు ఆయాచితంగా ఎదురైన సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పడిగాపులు కాసే స్థితికి చేర్చారు. ఈ నేపథ్యంలోనే బదిలీల నిర్వాహణకు ఒక శాశ్వత కోడ్ ఉంటే బాగుంటుందనే డిమాండ్ కు మరింత ఊపందుకుంది. అసంబద్ధతకు, అసమతుల్యతకు మారుపేరుగా మిగిలిన అసంబద్ధ జీఓ 187 కు బదులు శాశ్వత కోడ్ ఏర్పాటు ఆవశ్యకతను గుర్తు చేసింది.
ధన్యవాదాలతో...
■మోహన్ దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఎపిటీఎఫ్ 1938.